శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.
బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.
దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.