యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.
అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.
అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు.
నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.
ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.
యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు.
చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.