యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.
యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
చెక్కిన విగ్రహాలూ దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.