ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధాన్య నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోదుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి, సాంబ్రాణి వేయాలి.
అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.
మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి.
ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.
ఈ పదార్ధాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకు వస్తాడు.
తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోడానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకీ, అతని కొడుకులకీ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.
మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యం లోనూ పొంగజేసే పదార్ధం ఉండకూడదు. ఎందుకంటే తేనెనూ, పొంగజేసే పదార్ధం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు.
వాటిని ప్రథమఫలంగా యెహోవాకి సమర్పించవచ్చు. కానీ బలిపీఠం పైన కమ్మని సువాసన కలగజేయడానికి వాటిని వాడకూడదు.
నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికీ ఉప్పు కలపాలి. నీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి.
నువ్వు యెహోవాకి ప్రథమ ఫలం నైవేద్యాన్ని అర్పించాలంటే పచ్చని కంకుల్లోని కొత్త ధాన్యాన్ని వేయించి పిండి చేసి అర్పించాలి.