యోబు తన దృష్టికి తాను నీతిమంతుడుగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు.
అప్పుడు రము వంశస్థుడు, బూజీయుడు, బరకెయేలు కుమారుడు అయిన ఎలీహు, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకోవడం చూసి అతని మీద ఎంతో కోపగించాడు.
యోబు ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకుండా యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు ఎంతో కోపగించాడు.
కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు.
ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను. మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు. ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు.
నా మనస్సు తెరవని ద్రాక్షారసపు తిత్తి లాగా ఉంది. కొత్త తిత్తుల్లాగా అది పిగిలిపోడానికి సిద్ధంగా ఉంది.
మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను.