“బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు.”
వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.
ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?
ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.
ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు. దాన్ని గానుగలో వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు.
వారు ఒంటరి అడవి గాడిదలాగా అష్షూరీయుల దగ్గరికి పోయారు. ఎఫ్రాయిము తన కోసం విటులను డబ్బిచ్చి పిలిపించుకుంది.
వారు కానుకలు ఇచ్చి అన్యజనాల్లో విటులను పిలుచుకున్నా ఇప్పుడే నేను వారిని సమకూరుస్తాను. చక్రవర్తి పీడన పెట్టే బాధ కింద వారు కృశించి పోతారు.
నేను పదివేల సార్లు అతని కోసం నా ధర్మశాస్త్రాన్ని రాయించి నియమించినా, అయినా దాన్ని ఎప్పుడూ చూడనట్టుగా అతడు ఉంటాడు.
నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.