“నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.
తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.
ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.
ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.
ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.
గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.
ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి.
ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి.
అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి.
ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి.
నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి.
తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి.
ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.