Chapter 11 of 12

ప్రసంగి11

నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి . చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది .

దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు.

మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది.

గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.

స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.

ఉదయాన విత్తనం నాటు. సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు.

వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో!

ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే.

యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. నీ యువదశలో మనసారా సంతోషించు. నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.

నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.

ప్రసంగి 11 · KJV Audio
0:00
0:00