దీర్ఘ దర్శి, హనానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్లి, యెహోషాపాతు రాజుకు ఇలా తెలియచేశాడు. “నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది.
అయితే, నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలోనుంచి నువ్వు అషేరా దేవతాస్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనస్సు నిలుపుకున్నావు.”
యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్లి, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాడు.
అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.
యెహోవా భయం మీమీద ఉండు గాక. తీర్పు తీర్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు.”
యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో యాజకుల్లో ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.
నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.