దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.
దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.
వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.
తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.
ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.
సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.
దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.
అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
“ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.
సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”
సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.