నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.